
లక్నో: న్యూజిలాండ్తో కీలక రెండో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. దాంతో న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేసారు. ముఖ్యంగా భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డు తమ పేరిట లిఖించుకుంది. టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్కు ఇది అత్యల్ప స్కోర్. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్(19 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో రెండో ఓవర్లోనే స్పిన్నర్ను రంగంలోకి దింపిన హార్దిక్ పాండ్యా ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో డేంజరస్ ఫిన్ అలెన్ను యుజ్వేంద్ర చాహల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. మరుసటి ఓవర్లో సుందర్ సూపర్ ఫామ్లో ఉన్న డెవాన్ కాన్వే(11)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 33 పరుగులే చేసింది.
పవర్ ప్లే అనంతరం దీపక్ హుడా.. స్టన్నింగ్ డెలివరీతో గ్లేన్ ఫిలిప్స్(5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బౌండరీతో జోరు కనబర్చిన డారిల్ మిచెల్ను కుల్దీప్ యాదవ్ సూపర్ స్పిన్తో డారిల్ మిచెల్(8)ను బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ క్రమంలో ఆత్మరక్షణగా ఆడిన చాప్మన్(14)ను కుల్దీప్ సూపర్ ఫీల్డింగ్తో రనౌట్ చేశాడు. ఈ క్రమంలో నిదానంగా ఆడుతున్న బ్రేస్వేల్(14)ను పాండ్యా పెవిలియన్ చేర్చగా.. అర్ష్దీప్ సింగ్ తన 18వ ఓవర్లో సోదీ(1),ఫెర్గూసన్(0)లను పెవిలియన్ చేర్చాడు. 19వ ఓవర్లో జకోబ్ బౌండరీ బాదడంతో 11 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్ను కట్టడిగా వేసిన అర్ష్దీప్ సింగ్ 5 పరుగులు మాత్రమే ఇచ్చి న్యూజిలాండ్ను స్వల్ప స్కోర్కు పరిమితం చేశాడు. ఈ మ్యాచ్లో 13 ఓవర్లు వేసిన భారత స్పిన్నర్లు 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసారు.