ధర్మశాల: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. జెంటిల్మెన్ గేమ్లో ఫెయిర్ ప్లే ఆడే జట్లలో కివీస్ ముందుంటుంది.
బౌండరీల కౌంట్ అనే అసంబంద్దమైన నిబంధనతో వన్డే ప్రపంచకప్ టైటిల్ చేజారినా.. ఆ జట్టు ఆటగాళ్ల ముఖాల్లో చిరునవ్వు చెరగలేదు. తొండాట ఆడట ఆ జట్టు బ్లడ్లోనే లేదు. క్రికెట్లో తమ ఆటతో న్యూజిలాండ్ అందరికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. భారత్తో మ్యాచ్లోనూ న్యూజిలాండ్ క్రీడా స్ఫూర్తి చాటుకుంది.

టీమిండియా ఫీల్డర్ల ఓవర్ త్రో కారణంగా అదనపు పరుగులు తీసే అవకాశం వచ్చినా.. న్యూజిలాండ్ బ్యాటర్లు తిరస్కరించారు. ఈ పనితో వేలాది మంది భారత అభిమానుల మనసులను గెలుచుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 24 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ను రవీంద్ర జడేజా వేయగా.. రెండో బంతిని రచిన్ రవీంద్ర స్క్వేర్ లెగ్ దిశగా ఆడగా రెండు పరుగులు వచ్చాయి.
సూర్యకుమార్ యాదవ్ విసిరిన బంతి జడేజాను ధాటి బౌండరీ వైపు వెళ్లింది. దాంతో ఎక్స్ట్రా రన్ తీసే అవకాశం కివీస్ ఆటగాళ్లకు దక్కింది. కానీ రన్ తీయకుండా రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. కివీస్ బ్యాటర్లు చేసిన ఈ పనికి ఫిదా అయిన ప్రేక్షకులు వారిని చప్పట్లతో అభినందించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/54) కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.