న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. పుణె వేదికగా శనివారం ముగిసిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
యశస్వి జైస్వాల్(65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(84 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(6/104) ఆరు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఆజామ్ పటేల్కు రెండు వికెట్లు దక్కగా.. గ్లేన్ ఫిలిప్స్కు ఓ వికెట్ దక్కింది.

ఈ గెలుపుతో న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మరోవైపు భారత్ 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయింది. 2012లో చివరి సారిగా ధోనీ సారథ్యంలోని టీమిండియా.. సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా 18 టెస్ట్ సిరీస్లు గెలిచిన టీమిండియా.. తాజా సిరీస్లో మాత్రం ఖంగుతిన్నది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 103 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటర్ల వైఫల్యం ఓటమికి కారణమైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ బ్యాటింగ్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.