
రాంచీ: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20కి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హాజరయ్యాడు. తన అడ్డా అయిన రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కు ధోనీ తన సతీమణి సాక్షి సింగ్తో వచ్చాడు. గ్యాలరీలో తన సన్నిహితుల మధ్య మ్యాచ్ తిలకిస్తున్న ధోనీని టీవీ కెమెరాలు పదే పదే చూపించగా.. అభిమానులు ధోనీ ధోనీ.. అంటూ బిగ్గరగా అరిచారు. దాంతో ధోనీ వారికి అభివాదం చేసి ఆనందరపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
ఈ మ్యాచ్కు ముందే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చిన ధోనీ.. ఆటగాళ్ల అందరితో ముచ్చటించాడు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కొబ్బరి బోండా తాగుతూ ఆటగాళ్లను కలిసిన ధోనీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో మాట్లాడటం కనిపించింది. ఈ వీడియోను కూడా బీసీసీఐనే అభిమానులతో పంచుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), డారిల్ మిచెల్(30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికీ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
శుభ్మన్ గిల్(7), ఇషాన్ కిషన్(4), రాహుల్ త్రిపాఠి(0) దారుణంగా విఫలమవ్వడంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(47), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ఇష్ సోదీ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సూర్యను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా(21) కూడా పెవిలియన్ చేరాడు.