ముంబై: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. న్యూజిలాండ్తో సోమవారం ముగిసిన టెస్ట్ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించిన భారత్ 372 పరగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. అయితే ఈ విజయంలో మహమ్మద్ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించాడు.
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సూపర్ స్పెల్తో ఈ హైదరాబాద్ గల్లీ భాయ్.. మూడు వికెట్లు తీయడంతో కివీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 62 పరుగులకే కుప్పకూలింది. దాంతోనే మ్యాచ్ ముగిసినంతరం గ్యాలరీలోని ప్రేక్షకులు సిరాజ్ సిరాజ్.. అంటూ పెద్ద ఎత్తున అరిచారు. అంతేకాకుండా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ.. పేరును కూడా ప్రస్తావించారు. ఇక అభిమానుల అరుపులకు స్పందించిన సిరాజ్.. ఫ్లైయింగ్ కిస్లు ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా ఆర్సీబీకి బదులు భారత్ అని పిలవాలని సూచించాడు. తన జెర్సీపై ఉన్న ఇండియా పేరు సూచిస్తూ మరీ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అభిమానులు సైతం ఈ వీడియోను చూసి సిరాజ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ మహమ్మద్ సిరాజ్ను రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది.
న్యూ జిలాండ్తో టీ20 సిరీస్ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టెస్టు సిరీస్నూ కూడా చేజిక్కించుకుంది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో నెగ్గింది. తొలి టెస్టులో విజయానికి వికెట్ దూరంలో ఆగిపోయిన భారత్.. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 372 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్ను చేజిక్కించుకుంది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోరు 140/5తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టు కేవలం 27 పరుగుల తేడాలో మిగతా అయిదు వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లను జయంత్ యాదవ్ (4/34) సొంతం చేసుకోవడం విశేషం.
మరో వికెట్ను అశ్విన్ (4/49) సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 325 పరుగులు చేయగా.. కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ను టీమ్ఇండియా 276/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ సాధించిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసి, 70 పరుగులు చేసిన అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.