ధర్మశాల: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన తొలి మ్యాచ్లోనే (5/54) నిప్పులు చెరిగాడు. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమవడంతో తుది జట్టులోకి వచ్చిన షమీ.. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సత్తా చాటాడు.
ఈ ప్రదర్శనతో తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. ప్రపంచకప్ల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్లో ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్లు ఆడిన షమీ రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు 36 వికెట్లు పడగొట్టాడు.
మరే భారత బౌలర్ కూడా రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోలేదు. ఐదు వికెట్ల ఘనతను అందుకున్న భారత బౌలర్ల జాబితాలో మహమ్మద్ షమీతో పాటు
కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్లు ఉన్నారు.
36 వికెట్లతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. ప్రపంచకప్లో అనిల్ కుంబ్లే 31 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో 44 వికెట్లతో జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

తాజా ప్రపంచకప్లో అతను వరుసగా ఆడితే జహీర్ ఖాన్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ ఇద్దరు మినహా మరే బ్యాటర్ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో షమీకి తోడుగా కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.
భారత ఫీల్డర్లు మూడు సునాయస క్యాచ్లను నేలపాలు చేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర మూడో వికెట్కు 159 పరుగులు జోడించారు. భారత ఫీల్డర్లు ఆక్యాచ్లు పట్టి ఉంటే న్యూజిలాండ్ ఇంత స్కోర్ కూడా చేసేది కాదు.