దుబాయ్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అభిప్రాయపడ్డాడు. ఒకే వేదికగా మ్యాచ్లు నిర్వహించడం ద్వారా టీమిండియాకు అదనపు ప్రయోజనం కలుగుతుందనే వ్యాఖ్యలతో మిచెల్ సాంట్నర్ ఏకీభవించాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
టీమిండియాకు మేలు చేసేలా ఐసీసీ నిర్ణయం తీసుకుందని, ఒకే వేదికగా మ్యాచ్లు నిర్వహించడం అన్యాయమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. మైకేల్ వాన్ అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత విజయాలను తక్కువ చేసేలా మాట్లాడాడు. ఈ విమర్శలను భారత మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో తిప్పికొట్టారు.

తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 'టీమిండియా అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడటంతో అక్కడి పిచ్ కండిషన్స్ వారికి బాగా తెలుసు. సహజంగా పిచ్ కండిషన్స్ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. లాహోర్తో పోలిస్తే.. దుబాయ్లో బంతి మరింత నెమ్మదిగా మూవ్ అవుతోంది. అది చిన్న విషయమే. కానీ దాన్ని కూడా మేం విస్మరించం.
లీగ్ దశలో భారత చేతిలో ఓడిపోయాం. అయితే ఇప్పుడు మరింత మెరుగై వచ్చాం. మ్యాచ్ల కోసం వివిధ ప్రదేశాలనకు ప్రయాణించడం ఈ టోర్నీ సాధారణమే. ఆయా జట్లు ఎదుర్కొనే సవాళ్లలో ఇదీ ఒకటి. ఈ ప్రయాణాలను కూడా మా కుర్రాళ్లు లైట్ తీసుకున్నారు. నేను అయితే ఇదంతా టోర్నీలో భాగమేనని భావిస్తున్నాను. మ్యాట్ హెన్రీ గాయంపై ఇప్పుడే ఏం చెప్పలేను. అతను కోలుకొని మ్యాచ్ బరిలో నిలుస్తాడని భావిస్తున్నాం. కొన్ని స్కాన్లు కూడా చేయించాం. కానీ, ఈ పరిస్థితుల్లో ఆ విషయాన్ని కచ్చితంగా మేం చెప్పలేకపోతున్నాం'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డెవిడ్ మిల్లర్ సైతం.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు అదనపు ప్రయోజనం కలిగిందని, ఫైనల్లో తాను న్యూజిలాండ్కు సపోర్ట్ చేస్తానని తెలిపాడు. అయితే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఆ దేశంలో పర్యటించలేమని బీసీసీఐ పేర్కొంది. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటామని కూడా తెలిపింది. టీమిండియా లేకుండా టోర్నీని నిర్వహించలేమని భావించిన ఐసీసీ చివరకు హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహిస్తోంది.