ఓపెనర్ల శుభారంభం..
మైదానం చిత్తడిగా మారడంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ల శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలమైన ఫ్లాట్ వికెట్పై కొత్త బంతిని తరుచూ బౌండరీకి పంపారు. దాంతో స్కోర్ బోర్డు వేగంగా పరుగెత్తింది. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ.. క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేసింది. వికెట్పై కవర్లు కప్పి ఉంచడంతో స్వింగ్ అవుతుందని భావించినా అదేం ఇబ్బందిగా మారలేదు. దాంతో ఓపెనర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని ఆజాజ్ పటేల్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్మన్ను రాస్ టేలర్ సాయంతో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసాడు.
వరుసగా రెండు వికెట్లు..
అదే స్కోర్ వద్ద టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన చతేశ్వర పుజారా(0), విరాట్ కోహ్లీ(0)లను ఆజాజ్ పటేల్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ముందుగా పుజారాను క్లీన్ బౌల్డ్ చేసిన ఆజాజ్ ఆ తర్వాత విరాట్ కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అయితే కోహ్లీ వికెట్పై వివాదం చెలరేగింది. కోహ్లీ సమీక్ష కోరినా.. థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టబడ్డాడు. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా 111/3 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
మయాంక్ సెంచరీ..
టీ బ్రేక్ అనంతరం క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ను ఆజాజ్ పటేల్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన వృద్దీమాన్ సాహాతో కలిసి మయాంక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఓపికగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే డారిల్ మిచెల్ వేసిన 59వ ఓవర్లో తొలి బంతిని బౌండరీ బాది 196 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత మెచ్యూర్గా ఆడిన మయాంక్ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించాడు.