న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత జట్టుపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాపై ఐదు వికెట్ల ఘనత సాధించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో మ్యాట్ హెన్రీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లతో పాటు.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ వికెట్ తీసిన మ్యాట్ హెన్రీ.. ఆ కాసేపటికే గ్లేన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్తో విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. చివర్లో నిలకడగా ఆడుతున్న రవీంద్ర జడేజాను కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చిన మ్యాట్ హెన్రీ.. ఆఖరి ఓవర్లో దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యాతో పాటు మహమ్మద్ షమీని ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.