
కాన్పూర్: భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు టామ్ లాథమ్(85 బ్యాటింగ్), విల్ యంగ్ (214 బంతుల్లో 15 ఫోర్లతో 89) మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఏకంగా 151 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే టామ్ లాథమ్(165 బంతుల్లో 4 ఫోర్లతో 50) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకొని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దాంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ టీమిండియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'ఈ టెస్టులో టామ్ లాథమ్ సెంచరీ నమోదు చేస్తే.. టీమిండియా డీఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయమంటుందేమో.!' అని నీషమ్ ట్వీట్ చేశాడు.
రెండో రోజు టీమ్ఇండియా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. 258/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన భారత్ 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆట ముగిసే సరికి 129/0 స్కోరుతో నిలిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇషాంత్ శర్మ వేసిన మూడో ఓవర్లోనే లేథమ్ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే, డీఆర్ఎస్లో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుందని తేలింది. తర్వాత 15వ ఓవర్లో జడేజా బౌలింగ్లోనూ లేథమ్ మరోసారి వికెట్ల ముందు దొరికిపోయాడు.
మళ్లీ రివ్యూకి వెళ్లి బతికిపోయాడు. 56వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బంతికి లాథమ్ క్యాచ్ ఔట్ అయినట్లు భావించి అంపైర్ వేలెత్తాడు. సమీక్షలో బంతి ప్యాడ్ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడిందని తేలింది. దీంతో మూడోసారి కూడా లేథమ్ బతికిపోయాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ తర్వాత సమీక్షను ఉపయోగించుకుని మూడు సార్లు బతికిపోయిన రెండో ఆటగాడిగా లాథమ్ రికార్డు సృష్టించాడు.
ఇక 129/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్(64 బంతుల్లో 68) వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సూపర్ క్యాచ్కు విల్ యంగ్ వెనుదిరగ్గా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో విలియమ్సన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(9 బ్యాటింగ్)తో కలిసి లాథమ్ ఆచితూచి ఆడుతున్నాడు.