IND vs NZ, CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే చీలమండ గాయంతో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు దూరం కాగా.. రవీంద్ర జడేజా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.
తాజాగా ప్రాక్టీస్ సెషన్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. బౌలర్ వేసిన ఫుల్టాస్ బాల్ అతని చేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన సూర్యకుమార్ యాదవ్.. అర్థాంతరంగా ప్రాక్టీస్ ముగించుకొని మైదానం బయటకు వెళ్లాడు. అతని గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రాక్టీస్ సెషన్లో ఇషాన్ కిషన్ను తేనటీగ కుట్టగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. కంటి పైభాగంలో తేనెటీగ కుట్టడంతో భాగా ఉబ్బినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ బరిలోకి దిగుతారని అంతా భావిస్తున్నారు.
శార్దూల్ ఠాకూర్ను పక్కనపెట్టి షమీని ఆడించాలనే డిమాండ్ ఎక్కువైంది. అయితే సూర్య గాయపడటం.. ఇషాన్ కిషన్కు కందిరీగ కుట్టడంతో తుది జట్టులోకి ఎవరు వస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరూ రేపు మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే టీమిండియా స్టాండ్ బై ప్లేయర్లను పిలిపించాల్సి ఉంటుంది.
వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్పై టీమిండియాకు మెరుగైన రికార్డు లేకపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2003 వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా న్యూజిలాండ్ను ఓడించిన టీమిండియా.. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో మాదిరే రోహిత్ సేన కూడా ఓటమికి తలవంచుతుందా? లేక చరిత్రను తిరగరాస్తుందా? అనేది తేలాల్సి ఉంది.