టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్లో చివరి వన్డే ఆడేసాడా? అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ప్రవర్తించిన తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. ఈ మ్యాచ్లో జడేజా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి ఓ వికెట్ తీసాడు. తన స్పెల్ పూర్తయిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కాగా.. జడేజా రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. వన్డే, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే వన్డేల నుంచే తప్పుకుంటాడా? లేక టెస్ట్ కెరీర్కు కూడా వీడ్కోలు పలుకుతాడా? అనేది చూడాలి. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. కోహ్లీ కొనసాగినా.. రోహిత్ తప్పుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 204 వన్డేలు ఆడి 2797 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 231 వికెట్లు తీసాడు. 2సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 37), గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) సత్తా చాటినా.. పేసర్లు మహమ్మద్ షమీ(1/74), హార్దిక్ పాండ్యా(0/30) దారుణంగా విఫలమయ్యారు.
Virat Kohli hugged Ravindra Jadeja after Jadeja bowled his spell. ❤️ pic.twitter.com/gznlREq52U
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025