టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులో అతను మరో హార్దిక్ పాండ్యా అవుతాడని కొనియాడాడు. న్యూజిలాండ్తో ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
బౌలింగ్లో వికెట్లు తీయనప్పటికీ గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో నితీష్ రెడ్డికి మరిన్ని అవకాశాలు ఇస్తామని కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు.
ఇర్ఫాన్ పఠాన్ సైతం నితీష్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 'నితీష్ కుమార్ రెడ్డి సానుకూల ఆటను కనబరిచాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో రాజ్కోట్లో నితీష్ రెడ్డికి అవకాశం దక్కింది. అయితే అతన్ని తొలి మ్యాచ్ నుంచే తుది జట్టులో ఆడించాల్సింది. నితీష్ రెడ్డి పెద్ద షాట్లు ఆడటంతో పాటు స్పిన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. రెండు మ్యాచ్ల్లో కీలక భాగస్వామ్యాల్లో భాగమయ్యాడు.

చాలా అలవోకగా భారీ షాట్స్ ఆడుతున్నాడు. అది పుల్ షాట్ అయినా.. స్ట్రైట్ షాట్ అయినా చాలా ఈజీగా బాదుతున్నాడు. అతని బౌలింగ్ విధానం కూడా అద్భుతంగా ఉంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించాడు. ఇది మంచి స్పీడ్. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆల్రౌండర్గా కనిపిస్తున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనా.. అతనికి టీమ్మేనేజ్మెంట్ అండగా ఉండాలి. అప్పుడే అతను గొప్ప ఆల్రౌండర్గా మారుతాడు.'అని టీమ్మేనేజ్మెంట్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
నితీష్ కుమార్ రెడ్డి 2024లో భారత్ తరఫున టీ20, టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో అతను సెంచరీ బాది అందర్నీ ఆకట్టుకున్నాడు. వన్డేల్లో 4 మ్యాచ్లు ఆడి 33.33 సగటుతో పాటు హాఫ్ సెంచరీతో 100 పరుగులు చేశాడు. 10 టెస్ట్ల్లో 26.40 సగటుతో 396 పరరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. బౌలింగ్లో 8 వికెట్లు తీసాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను 2-1తో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ శతకం చెలరేగినా.. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.