
ఆ ఒక్కటి గెలిస్తే మనదే అగ్రస్థానం..
న్యూజిలాండ్తో శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. 113 పాయింట్లతో న్యూజిలాండ్తో సమంగా నిలిచింది. తాజా ర్యాంకింగ్స్లో 113 పాయింట్లతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, భారత్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 112 పాయిట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉండగా.. 106 పాయింట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్తో ఇండోర్ వేదికగా మంగళవారం(జనవరి 24) జరగనున్న ఆఖరి వన్డేలో భారత్ విజయం సాధిస్తే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకుంటుంది.

చెలరేగిన బౌలర్లు..
రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ(3/18) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

రోహిత్ హాఫ్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51), శుభ్మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, సాంట్నర్ తలో వికెట్ తీసారు. నాలుగు వికెట్లతో భారత విజయం కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.


Click it and Unblock the Notifications












