|
పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి..
బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ మినహా పెద్దగా రాణించని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. గత 12 టీ20 మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్ ఒక్కటి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదని గుర్తు చేస్తున్నారు. ఈ 12 ఇన్నింగ్స్ల్లో 180 పరుగులే చేసిన ఇషాన్ కిషన్.. ఆదిలోనే వికెట్ పారేసుకున్నాడు. అతని స్ట్రైక్రైట్ కనీసం 120 ధాటలేదు. భారత్ వరుస విజయాలందుకోవడంతో ఇషాన్ కిషన్ వైఫల్యం పెద్దగా కనిపించలేదు. ఓపెనర్ల వైఫల్యంతో రెండు ప్రపంచకప్ల్లో టైటిల్ గెలిచే అవకాశాలను టీమిండియా కోల్పోయిందని, ఇప్పటికైన సరైన ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇషాన్ కిషన్కు బదులు పృథ్వీ షాను బరిలోకి తీసుకోవాలంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ టీ20 ఫార్మాట్కు సెట్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు. రెండో టీ20లో అతనికి అవకాశం ఇస్తే జట్టుకు కావాల్సిన ఆరంభం లభిస్తుందని చెబుతున్నారు.
శుభ్మన్కు బదులు జితేశ్ శర్మ..
టీ20ల్లో ఘోరంగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ స్థానంలో జితేశ్ శర్మను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. జట్టులో సరైన ఫినిషర్ లేడని, ఆ రోల్కు జితేశ్ శర్మ సెట్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు. జితేశ్ను జట్టులోకి తీసుకొని దీపక్ హుడా లేదా రాహుల్ త్రిపాఠిలను ఓపెనర్గా ఆడించాలని కోరుతున్నారు. వన్డేల్లో సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్.. టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో కీలకమైన పవర్ ప్లేలో అతను ధాటిగా ఆడలేకపోతున్నాడు.
అర్ష్దీప్ సింగ్ బదులు ముఖేశ్ కుమార్..
టీ20 ప్రపంచకప్ తర్వాత పేలవ బౌలింగ్తో విమర్శల పాలవుతున్న అర్ష్దీప్ సింగ్పై కూడా వేటు వేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా తొలి టీ20లో చివరి ఓవర్లో 27 పరుగులిచ్చి భారత ఓటమికి అర్ష్దీప్ సింగ్ కారణమయ్యాడని, పదే పదే నోబాల్స్ వేస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. అతనికి బదులు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ముఖేశ్ కుమార్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మూడు మార్పులతో బరిలోకి దిగితే రెండో టీ20లో భారత్కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు.