న్యూజిలాండ్తో మూడో టెస్ట్లోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేలవ బ్యాటింగ్తో తొలి రెండు టెస్ట్ల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. కనీసం ఆఖరి మ్యాచ్ అయిన గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. అందుకుతగ్గట్టుగానే ముంబై వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్లో భారత బౌలర్లు సత్తా చాటారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ను 235 పరుగులకు ఆలౌట్ చేశారు. కానీ బ్యాటర్లు మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. చివరి 15 నిమిషాల్లో 8 బంతులు.. 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకున్నారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లకు 86 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

రెండో రోజు కీలకం..
ఈ క్రమంలో ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు సాధించాలన్నా.. గెలుపుబాట పట్టాలన్నా.. రెండో రోజు ఆట అత్యంత కీలకం. తొలి ఇన్నింగ్స్లో మెరుగైన ఆధిక్యం సాధిస్తేనే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించగలదు. లేకుంటే.. ఈ మ్యాచ్లోనూ ఘోర పరాభావం తప్పదు. రోహిత్ సేన భారీ ఆధిక్యం సాధించాలంటే రెండో రోజు తొలి సెషన్ను జాగ్రత్తగా ఆడాలి.
ఈ సెషన్లో ఒక్క వికెట్ ఇవ్వకుండా కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయాలి. ప్రస్తుతం భారత్ 149 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి సెషన్లోనే ఈ పరుగులకు చేరువవ్వాలి. రెండో సెషన్లో అధిగమించి.. భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వికెట్పై నాలుగో ఇన్నింగ్స్ ఆడటం చాలా కష్టం.
తొలి రోజే 14 వికెట్లు..
వికెట్ పూర్తిగా స్పిన్కు అనుకూలిస్తోంది. తొలి రోజే 14 వికెట్లు పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 11 వికెట్లు స్పిన్నర్లే తీసారు. భారత బౌలర్లు 66 ఓవర్లు బౌలింగ్ చేయగా.. పేసర్లు 11 ఓవర్లు మాత్రమే వేసారు. మిగతా 55 ఓవర్లను స్పిన్నర్లు అశ్విన్, సుందర్, రవీంద్ర జడేజా సంధించారు. తొలి రోజే స్పిన్ ఆధిపత్యం కొనసాగిన వేళ.. మిగతా రోజుల్లో వికెట్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నాలుగో ఇన్నింగ్స్లో 150 పరుగుల లక్ష్యం చేధించడం కూడా కష్టమే. కాబట్టి టీమిండియా విజయం సాధించాలంటే తొలి ఇన్నింగ్స్లో 150-200 పరుగుల ఆధిక్యం సాధించాలి. లేకపోతే టీమిండియాకు వైట్వాష్ తప్పదు. క్రీజులో రిషభ్ పంత్తో పాటు శుభ్మన్ గిల్ ఉన్నాడు.
శతకాలు సాధిస్తేనే..
సర్ఫరాజ్ ఖాన్తో పాటు రవీంద్ర జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పరుగులు చేసిన అనుభవం ఈ బ్యాటర్లకు ఉన్నా.. వారి నిలకడలేమి ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఐదుగురు బ్యాటర్లలో ఏ ఇద్దరు శతకాలు నమోదు చేసినా.. భారత్కు ఈజీగా 150 ప్లస్ రన్స్ ఆధిక్యం లభిస్తోంది.