రాయ్పూర్: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన భారత జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. ఉప్పల్ వేదికగా తొలి వన్డేలో స్లోఓవర్ రేట్కు కారణమైన టీమిండియాకు భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయం కన్నా 3 ఓవర్లు తక్కువ వేసినందున ఓవర్కు 20 శాతం చొప్పున మొత్తం 60 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్ స్లో ఓవర్ రేట్ అభియోగాలు నమోదు చేయగా.. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విచారణ చేపట్టాడు. ఈ తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించడంతో జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ ఫీజులో కొత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(31) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్క్నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. మైకేల్ బ్రేస్వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో భారత్ను ఓడించినంత పనిచేశాడు. అతనికి అండగా మిచెల్ సాంట్నర్(57) రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.
ఇక రెండో వన్డే రాయ్పూర్ వేదికగా శనివారం జరగనుండగా.. టీమిండియా నేడు అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. తద్వారా ఆఖరి మ్యాచ్లో బెంచ్ బలాన్ని పరీక్షించవచ్చని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓడినా.. మైకేల్ బ్రేస్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆత్మవిశ్వాసం రెండింతలు అయ్యింది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాంతో ఈ మ్యాచ్పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.