
అహ్మదాబాద్: టీ20 చరిత్రలోనే టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా టీమిండియా నయాచరిత్రను లిఖించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను హార్దిక్ సేన 2-1తో కైవసం చేసుకుంది. మరోవైపు ఘోర పరాజయంతో న్యూజిలాండ్ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 126 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రాహుల్ త్రిపాఠి(44), హార్దిక్ పాండ్యా(30) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్వేల్, టిక్నర్, సోదీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్(35), మిచెల్ సాంట్నర్(13) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(4/16) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్ మాలిక్(2/9), అర్ష్దీప్ సింగ్ 2(2/16), శివమ్ మావి(2/12) రెండేసి వికెట్లు తీసారు.
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు కోలుకోని దెబ్బ తీసారు. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లు చెలరేగడంతో ఫిన్ అలెన్(3), డెవాన్ కాన్వే(1), మార్క్ చాప్మన్(0), గ్లేన్ ఫిలిప్స్(2), మైకేల్ బ్రేస్వెల్(8) వరుసగా ఔటయ్యారు. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయి 30 పరుగుల మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. శివమ్ మావి దెబ్బతీసాడు. సాంట్నర్ను క్యాచ్ ఔట్ చేసిన మావి.. ఇష్ సోదీని డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. లూకీ ఫెర్గూసన్(0), బ్లెయిర్ టిక్నర్(1)లను హార్దిక్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ చేతులెత్తేసింది.