India vs New Zealand T20 WC కీలక మ్యాచ్.. టాస్ ఓడితే కోహ్లీసేన ఇంటికే!

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా ఫస్ట్ మ్యాచ్లోనే తీవ్రంగా నిరాశపరిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి అభిమానులకు తీరని మనో వేదనను మిగిల్చింది. ఈ మ్యాచ్ ముందు వరకు టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా.. ఈ ఘోర పరాజయంతో టోర్నీలో తమ ప్రయాణాన్ని కఠినంగా మార్చుకుంది. ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ ఆదివారం అదే దుబాయ్ వేదికగా 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతోంది.

కొంపముంచిన ‘మంచు’
అయితే ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్పై ఉన్న చెత్త రికార్డు కలవరపెడుతుండగా.. మరోవైపు మంచు ప్రభావం ఏం చేస్తుందా? అనే ఆందోళన కలిగిస్తోంది. పాక్తో మ్యాచ్లో టాస్ ఓడటమే టీమిండియా శాపమైంది. టాస్ గెలిచిన పాక్.. ఫీల్డింగ్ ఎంచుకొని పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బ్యాట్స్మెన్ పనిపట్టింది. ఆ తర్వాత మంచు ప్రభావం బ్యాటింగ్కు సునాయసంగా మారిన పిచ్పై అలవోక విజయాన్నందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్పై కూడా టాస్ గెలిచిన ఆ జట్టు ఫీల్డింగ్ ఎంచుకొని డ్యూ ప్రభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని విజయాన్నందుకుంది.

టాస్ గెలిచిన జట్లే..
ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో కూడా మంచు ప్రభావం కీలక కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. అదే చేస్తే టాస్ గెలిచిన జట్టు సగం మ్యాచ్ గెలిచినట్లే. ఈ క్రమంలోనే టాస్ పెద్దగా కలిసిరాని విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటా? అని అభిమానులు కలవరపడుతున్నారు. పైగా దుబాయ్ వేదికగా ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టే విజయాన్న వరించింది. మంచు ప్రభావం టాస్ ఓడిన జట్ల కొంప ముంచింది. ఇదే వేదికపై భారత్, పాకిస్థాన్ మ్యాచ్తో పాటు, ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్లోనూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లనే విజయం వరించింది. ఇక ప్రస్తుతం పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లోనూ ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్కే విజయవకాశాలున్నాయి.

టాస్ ఓడితే ఏం చేయాలంటే..?
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ టాస్ ఓడితే టీమిండియా పనైపోయినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆరంభంలో స్వింగ్కు అనుకూలించే పిచ్పై ట్రెంట్ బౌల్ట్తో పాటు ఇతర కివీస్ బౌలర్లు చెలరేగగలరు. అయితే టాస్ ఓడినా భారత్ గెలవాలంటే టాపార్డర్ బ్యాట్స్మన్ చెలరేగాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ ఆడిన అనుభవం లేక భారత ఓపెనర్లు విఫలమయ్యారని, కానీ ఐపీఎల్లో బౌల్ట్ బౌలింగ్ భారత ఆటగాళ్లకు సుపరిచితమేనంటున్నారు. టాప్-4 బ్యాట్స్మన్లో ఏ ముగ్గురు చెలరేగిన భారత్ భారీ స్కోర్ చేస్తుందని చెబుతున్నారు.

భారీ టార్గెట్ సెట్ చేస్తేనే...
టాస్ ఓడితే భారత్ ముందున్న ఏకైక ఆప్షన్ ఇదేనని, 180 ప్లస్ రన్స్ చేస్తేనే విజయం సాధించవచ్చంటున్నారు. భారీ లక్ష్యం ఉంటే బౌలర్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలా కాకుండా సాధారణ స్కోర్కు పరిమితమైతే పాక్పై ఎదురైన పరాజయమే వెక్కిరిస్తుందంటున్నారు. అప్పుడు టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఆడాల్సి ఉంటుందని, దానికి తగిన ప్రణాళికలు రచించాలని చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications