
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి వన్డే ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో (హెచ్సీఏ)లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పై ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్ ఆరోపణలు గుప్పించారు.
ఆయన ఏకపక్ష తీరుపై మండిపడ్డారు. ఉప్పల్లో మ్యాచ్ విషయమై సెక్రటరీ అయిన తనను కనీసం సంప్రదించలేదన్నారు.
'నన్ను బెదిరించి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. కులం పేరుతో చిన్న చూపు చూస్తున్నారు. అజారుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆన్లైన్ టికెట్లలో కూడా గోల్మాల్ చేశారు. నాతోపాటు నా ప్యానెల్ మొత్తాన్ని పక్కనపెట్టారు.'' అని విజయానంద్ విమర్శించారు. జనరల్ సెక్రటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజారుద్దీన్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అయితే అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు ముందు హెచ్సీఏలో విభేదాలు రావడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. రాజకీయాలతో హైదరాబాద్ క్రికెట్ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనకు ఈ రాజకీయాలు కూడా కారణమని ఆరోపిస్తున్నారు.
ఈ మ్యాచ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసామని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యాచ్కు హాజరయ్యేవారు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి టీమిండియా జోరు మీదుండగా.. పాకిస్థాన్ గడ్డపై 2-1తో సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే శ్రేయస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయ్యర్ దూరమవడంతో సూర్యకుమార్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది.