న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(122 బంతుల్లో 10 ఫోర్లతో 100) సూపర్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులు చేసింది. బ్రూక్ హాల్లీడే(96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. జార్జియా ప్లిమ్మర్(39) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ(3/39) మూడు వికెట్లు తీయగా.. ప్రియా మిశ్రా(2/41) రెండు వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, సైమా థాకోర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 236 పరుగులు చేసింది. స్మృతి మంధాన శతకంతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(68 బంతుల్లో 8 ఫోర్లతో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రోవే రెండు వికెట్లు తీయగా.. సోఫియా డివైన్, ఫ్రాన్ జోనాస్ తలో వికెట్ తీసారు.
233 పరుగుల లక్ష్యచేధనలో టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(12) తీవ్రంగా నిరాశపర్చగా.. యస్తికా భాటియాతో కలిసి మంధాన ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. రెండో వికెట్కు 72 పరుగులు జోడించిన అనంతరం యస్తికా భాటియా సోఫియా డివైన్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. క్రీజులోకి హర్మన్ప్రీత్ కౌర్ రాగా.. స్మృతి మంధాన 73 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. కాస్త దూకుడుగా ఆడిన హర్మన్ప్రీత్ కౌర్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మంధాన 121 బంతుల్లో సెంచరీ సాధించింది. ఆ వెంటనే మంధాన ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(11) గెలుపు ముంగిట పెవిలియన్ చేరింది. తేజల్ హసాబిన్స్తో కలిసి హర్మన్ప్రీత్ కౌర్ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.