లక్నో: భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడి గణంకాలు చేజింగ్ కష్టమని చెబుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన తాము అద్భుతంగా పుంజుకున్నామని, అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడమే కీలకమని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే టాస్ తమ చేతుల్లో లేని విషయమని, ద్వైపాక్షి సిరీస్ల్లో ఇదేం పెద్ద సమస్య కాదన్నాడు. గత మ్యాచ్లో తాము చేసిన తప్పిదాల నుంచి పాఠాలునేర్చుకున్నామన్నాడు. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందని, దాంతోనే ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ను తీసుకున్నామని తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, ఆ క్రమంలోనే పెద్దగా మార్పులు చేయలేదని చెప్పాడు.
రాంచీలో సమష్టిగా విఫలమైన టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లోతప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. తొలి టీ20లో పలువురి ఆటగాళ్ల వైఫల్యాల నేపథ్యంలో భారీ మార్పలు ఉంటాయని అంతా అనుకున్నారు. ముఖ్యంగా పృథ్వీ షాను జట్టులోకి తీసుకుంటారని భావించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగింది.
తుది జట్లు
భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్(కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), మార్క్ చాప్మన్, గ్లేన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఇష్ సోదీ, జకోబ్ డఫ్ఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్