న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి టెస్ట్లో చెత్త బ్యాటింగ్తో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో టెస్ట్లోనూ అదే తడ'బ్యాటు'కొనసాగించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మరోసారి పేలవ బ్యాటింగ్తో 156 పరుగులకే కుప్పకూలింది.
తొలి టెస్ట్ పరాజయంతో స్పిన్ అస్త్రాన్ని నమ్ముకున్న టీమిండియా.. బొక్కబోర్లా పడింది. ప్రత్యర్థి స్పిన్నర్ల ధాటికి విలవిలలాడింది. 'ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడినట్లు' ఉంది టీమిండియా పరిస్థితి. స్పిన్ బౌలింగ్తో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాలనుకున్న టీమిండియా.. అదే స్పిన్కు చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటవ్వగా.. రెండో రోజు ఇతర ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు.

16/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. స్వల్ప వ్యవధిలోనే శుభ్మన్ గిల్(30), విరాట్ కోహ్లీ(1), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11),రవిచంద్రన్ అశ్విన్(4), రవీంద్ర జడేజా(38), ఆకాశ్దీప్(6), జస్ప్రీత్ బుమ్రా(0)ల వికెట్లు కోల్పోయింది. జడేజాకు ఒక లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు.
న్యూజిలాండ్కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో రోజు టీమిండియా 140 పరుగులు చేసి చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా స్పిన్కు తగ్గట్లు ఆడే ప్రయత్నం చేయలేకపోయారు. ముఖ్యంగా భారత బ్యాటర్లలో ఓపిక సహించింది.
చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్లోనే టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ రెండో వికెట్కు నమోదు చేసిన 49 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. ఆ తర్వాత మరే బ్యాటర్ కూడా కనీసం 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు.
దాంతో టీమిండియా బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పేలవ ఆటతీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా స్పిన్ ఆడటంలో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా గౌతమ్ గంభీర్.. స్పిన్ అస్త్రాన్ని ఎంచుకోవడం ఏందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.