'కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు ఉంది'అనే సామెత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు సరిగ్గా సరిపోతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో అతను కనబర్చిన అత్యుత్సాహం టీమిండియా కొంపముంచింది. నిలకడగా ఆడుతున్న అక్షర్ పటేల్కు టీమ్ 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్తో ఇచ్చిన సలహా మిస్ఫైర్ అయ్యింది. గంభీర్ అనాలోచిత సలహా కారణంగా కీలక భాగస్వామ్యానికి తెరపడటంతో పాటు అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ మిస్సైంది.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(2)ను మ్యాట్ హెన్రీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(15) తన ట్రేడ్ మార్క్ పుల్షాట్ ఆడబోయి.. జెమీసన్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీకి గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్తో షాకిచ్చాడు. దాంతో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో లెఫ్టాండర్గా బ్యాటింగ్లో ప్రమోషన్ అందుకున్న అక్షర్ పటేల్..శ్రేయస్ అయ్యర్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన అనంతరం వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 29వ ఓవర్ అనంతరం గంభీర్.. వాషింగ్టన్ సుందర్తో అక్షర్ పటేల్కు ఓ మేసేజ్ పంపించాడు. దూకుడుగా ఆడాలని చెప్పాడో లేక మరే విషయమో తెలియదు కానీ.. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్ పటేల్ అనవసర షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అనవసర షాట్తో..
రచిన్ రవీంద్ర వేసిన 30వ ఓవర్ తొలి బంతికి శ్రేయస్ అయ్యర్ సింగిల్ తీసి అక్షర్ పటేల్ స్ట్రైక్ ఇవ్వగా.. అతను లెగ్ సైడ్ వచ్చిన బంతి లేట్ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేవగా.. కేన్ విలియమ్సన్ సింగిల్ హ్యాండ్తో అద్భుతంగా అందుకున్నాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఓవర్కు ముందే గంభీర్ సలహాను సుందర్.. అక్షర్ పటేల్కు తెలియజేశాడు. ఇది టీవీ కెమెరాల్లో కనిపించింది. బ్యాటింగ్ అప్రోచ్ మార్చాలనే గంభీర్ చెప్పి ఉండవచ్చని కామెంటేటర్లు తెలిపారు. అయితే అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసే వరకు అయినా గంభీర్ ఆగాల్సిందని, అతని అనాలోచిత సలహా టీమిండియాకు నష్టం చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.