
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ గడ్డపై సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్ కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. 11 ఫోర్లు, 7 సిక్స్లతో విర విహారం చేశాడు. సూర్య విధ్వంసంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా(13), దీపక్ హుడా(0), వాషింగ్టన్ సుందర్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసిన టీమ్ సౌథీ హ్యాట్రిక్ వికెట్తో భారత్ 200 పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. అంతేకాకుండా టీమ్ సౌథీకి టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. ఈ ఫార్మాట్లో ఈ ఘనత అందుకున్న రెండో బౌలర్గా టీమ్ సౌథీ నిలిచాడు. సౌథీ కన్నా ముందు శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా ఈ ఘనత సాధించాడు. అయితే ఓ టీ20 మ్యాచ్లో సెంచరీతో పాటు హ్యాట్రిక్ వికెట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. దాంతో ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. టీమ్ సౌథీకి తోడుగా ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోదీకి ఓ వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రిషభ్ పంత్ను ఓపెనర్గా ప్రమోట్ చేస్తూ చేసిన ప్రయోగం ఫలితం ఇవ్వలేదు. ఫెర్గూసన్ వేసిన ఐదో ఓవర్లో పంత్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులోకి సూర్య రాగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36)ను ఇష్ సోదీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి సూర్య ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కివీస్ బౌలర్లపై సూర్య ఎదురుదాడికి దిగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసాడు. శ్రేయస్ అయ్యర్(13) హిట్ వికెట్గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత హార్దిక్ క్రీజులోకి రాగా.. సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సూర్య.. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో 5 ఫోర్లు, సిక్స్ బాదిన సూర్య మొత్తం 22 పరుగులు పిండుకొని కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. చివరి ఓవర్లో టీమ్ సౌథీ.. హార్దిక్ పాండ్యా(13), దీపక్ హుడా(0), వాషింగ్టన్ సుందర్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడంతో టీమిండియా 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. ఈ ఓవర్లో సూర్య ఒక్క బంతి కూడా ఆడలేకపోయాడు.