|
ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగానే..
ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో రోహిత్, శుభ్మన్ గిల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వన్డేలో విఫలమైన కోహ్లీ, సూర్య, ఇషాన్, హార్దిక్ పాండ్యా.. లోటార్గెట్ నమోదైన రెండో మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని అందుకోలేకపోయారు. ఒక్క కోహ్లీ మాత్రమే రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వారికి విశ్రాంతివ్వకుండా కొనసాగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా ప్రధాన ఆటగాళ్లందరితో ప్రతీ మ్యాచ్ ఆడించాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోర్ టీమ్ను డిస్టర్బ్ చేయకుండా మార్పులు చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలోనే షమీ, సిరాజ్లకు రెస్ట్ ఇచ్చారు.
|
పాపం భరత్, పటిదార్..
బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో కేఎస్ భరత్, రజత్ పటీదార్ అవకాశాలు అందుకోలేకపోయారు. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. కేఎల్ రాహుల్ పెళ్లి కోసం లీవ్ తీసుకోవడంతో కేఎస్ భరత్ తొలిసారి భారత జట్టు పిలుపును అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే తన కలను సాకారం చేసుకోలేకపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరమవడంతో జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్ సైతం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ ఇద్దరికి అవకాశాలు ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నామమాత్రపు మ్యాచ్ల్లో కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.
|
బెంచ్ బలం కూడా ముఖ్యమే..
ప్రపంచకప్ గెలవాలంటే ప్రధాన జట్టుతో పాటు బెంచ్ కూడా బలంగా ఉండటం చాలా ముఖ్యమని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. మెగా టోర్నీ కీలక సమయంలో ఏ ఆటగాడైన గాయంతో తప్పుకుంటే అతని స్థానాన్ని భర్తీ చేయాల్సింది బెంచ్ ఆటగాళ్లేనని, వారు కూడా ఫామ్లో ఉండటం ముఖ్యమని సూచిస్తున్నారు. ఈ నామమాత్రపు మ్యాచ్లో రజత్ పటీదార్తో పాటు కేఎస్ భరత్కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
దంచికొడుతున్న భారత బ్యాటర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నారు. తొలి బంతి నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ భారత స్కోర్ బోర్డును పరుగెత్తిస్తుంది. ఈ ఇద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసిన భారత్.. 23 ఓవర్లలోనే 193 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలకు చేరువలో ఉన్నారు.