మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగినా అర్ష్దీప్ సింగ్కు తుది జట్టులో చోటు లభించలేదు. మహమ్మద్ సిరాజ్,హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలతో కూడిన టీమిండియా పేస్ త్రయాన్ని మేనేజ్మెంట్ కొనసాగించింది.
ఫామ్లో ఉన్న అర్ష్దీప్ సింగ్ను పక్కనపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వికెట్ టేకర్ అయిన అర్ష్దీప్ సింగ్ను ఎందుకు పక్కన పెట్టారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఫేవరిటిజాన్ని బయటపెట్టుకున్నాడని మండిపడుతున్నారు. హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణల కోసం అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తుది జట్టులో అర్ష్దీప్ సింగ్ లేడనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికాతో జరిగిన గత మూడు వన్డేల సిరీస్లో నిలకడగా రాణించిన అర్ష్దీప్ సింగ్కు తదుపరి సిరీస్ తొలి అవకాశం దక్కకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్లో అర్ష్దీప్ 5.50 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు హర్షిత్ రాణా 6.39 ఎకానమీతో నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ 7.80 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ అర్ష్దీప్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణాతో బ్యాటింగ్ డెప్త్ పెరిగినా.. ధారళంగా పరుగులిచ్చే ప్రసిధ్ కృష్ణతో ఒరిగేదేం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కొత్త బంతితో ప్రభావం చూపే అర్ష్దీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో అర్ష్దీప్ సింగ్ను భాగం చేయాలని సూచిస్తున్నారు.
అర్ష్దీప్ సింగ్ ఎక్కడా? అని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రెస్ట్ ఇచ్చారని ఓ అభిమాని కామెంట్ చేయగా.. అశ్విన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. జట్టులోకి ఎంపిక చేసిన తర్వాత రెస్ట్ ఎందుకని, విశ్రాంతి అంటే బుమ్రాలా సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డాడు. ఇలా అవకాశాలు ఇవ్వకుండా పక్కనపెడితే బౌలర్ రిథమ్ కోల్పోవడంతో పాటు ప్రదర్శన దెబ్బతింటుందని అశ్విన్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్గా మారాయి.