ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో పూర్తి ఆధిపత్యం చెలాయించి విశ్వవిజేతగా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో స్పిన్నర్లతో పాటు రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 76) భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అతనితో పాటు చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే ఈ ఇద్దరి కంటే శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగే టీమిండియా విజయానికి ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవర్ ప్లేలోనే రోహిత్ శర్మ పరుగులు చేశాడని, కానీ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేశాడని గుర్తు చేస్తున్నారు. వరుసగా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔటైన తర్వాత.. అక్షర్ పటేల్తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడని గుర్తు చేస్తున్నారు. అక్షర్ పటేల్తో కలిసి నాలుగో వికెట్కు అయ్యర్ నమోదు చేసిన 61 పరుగుల భాగస్వామ్యం చాలా కీలకమని కూడా అభిప్రాయపడుతున్నారు.

శ్రేయస్ అయ్యరే ఈ భాగస్వామ్యం నెలకొల్పకుండా ఔటయ్యుంటే ఫలితం మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శ్రేయస్ అయ్యర్కే ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మ్యాచ్లోనే కాకుండా ఈ టోర్నీ అసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడుతున్నారు. రోహిత్, కేఎల్ రాహుల్ పాత్ర కీలకమే అయినా.. ఈ ఇద్దరి కంటే అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ గొప్పదని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా... మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.