టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 2 పరుగులే చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. వన్డే తరహా బ్యాటింగ్తో 63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు.
అయితే ఈ హాఫ్ సెంచరీని హిట్ మ్యాన్ తనదైన శైలిలో పూర్తి చేశాడు. ఫియర్లెస్ గేమ్తో వరుసగా 4, 6, 4 బాది 59 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మ్యాట్ హెన్రీ వేసిన 21వ ఓవర్లో మూడో బంతిని కవర్స్ వైపు బౌండరీ బాదిన రోహిత్.. మరుసటి బంతిని తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్తో మిడ్ వికెట్ దిశగా సిక్సర్ తరలించాడు. తర్వాతి బంతిని కూడా పుల్షాట్తో లెగ్ సైడ్ బౌండరీ కొట్టాడు.

ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ బౌండరీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'ఏం గుండెరా అది.. వరుస బౌండరీలతో హాఫ్ సెంచరా?' అంటూ కామెంట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్.. కీలక సమయంలో ఫామ్లోకి వచ్చాడు.
సాధికారకమైన బ్యాటింగ్తో సెంచరీ చేసేలా కనిపించిన రోహిత్.. దురదృష్టవశాత్తు అజాజ్ పటేల్ వేసిన మరుసటి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అజాజ్ పటేల్ వేసిన బంతిని రోహిత్ చక్కగా డిఫెన్స్ చేసాడు. కానీ పిచ్ అయిన బంతి వికెట్లను తాకేసింది. రోహిత్ శర్మ అప్రమత్తమైనప్పటికీ లాభం లేకపోయింది. ఈ అనూహ్య ఘటనకు అంతా అవాక్కయ్యారు. రోహిత్ శర్మ అయితే తలపట్టుకున్నాడు. బాధగా క్రీజును వీడాడు. అజాజ్ పటేల్ వేసిన 22వ ఓవర్లో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ఐదో బంతిని ఆజాజ్ పటేల్ ఆఫ్ స్టంప్ లెంగ్త్లో వేసాడు. రోహిత్ దాన్ని ఫార్వర్డ్ డిఫెన్స్ చేశాడు. కానీ ఔట్ సైడ్ ఎడ్జ్ అయిన బంతి ప్యాడ్స్-బ్యాట్ మధ్య ఉన్న ఖాళీ నుంచి వెళ్లి వన్ స్టెప్ తీసుకోని నిదానంగా వికెట్లు వైపు కదిలింది. రోహిత్ అప్రమత్తమయ్యే లోపే వికెట్లను తాకేసింది. రోహిత్ వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(134) సెంచరీ చేయగా.. టీమ్ సౌథీ(65) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దాంతో న్యూజిలాండ్కు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
4️⃣, 6️⃣, 4️⃣... What a cracking way to bring up a fabulous 50, Captain! 💥#RohitSharma #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/1KJEZVNGMv
— JioCinema (@JioCinema) October 18, 2024