సాగరతీరం విశాఖపట్నం వేదికగా మరో అంతర్జాతీయ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మరికొద్ది గంటల్లో నాలుగో టీ20 ప్రారంభం కానుంది. గత 4 నెలల్లో వైజాగ్ వేదికగా ఇది 9వ అంతర్జాతీయ మ్యాచ్. రెండో పురుషుల క్రికెట్ మ్యాచ్. భారత్లో మరే స్టేడియం కూడా ఇన్ని మ్యాచ్లకు ఆతిథ్య ఇచ్చే అవకాశం దక్కలేదు.
అక్టోబర్లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన వైజాగ్ స్టేడియం.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన భారత మహిళల టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లకు వేదికైంది. సౌతాఫ్రికాతో భారత పురుషుల మూడో వన్డేకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. తాజాగా న్యూజిలాండ్తో నాలుగో టీ20కి వేదికైంది.
4 నెలల వ్యవధిలోనే వైజాగ్ స్టేడియానికి ఇన్ని మ్యాచ్లు కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బీసీసీఐ రొటేషన్ పాలసీ, నిబంధనల ప్రకారం ఏడాదిలో స్టేడియానికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించడమే కష్టం. కానీ నారా లోకేష్ చొరవ తీసుకొని ఏకంగా 9 మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇచ్చేలా చేశారనే వాదన వినిపిస్తోంది. బీసీసీఐ పెద్దలతో పాటు ఐసీసీ ఛైర్మన్ జైషాతో నారా లోకేష్కు మంచి స్నేహం ఉండటంతో ఇది సాధ్యమైందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్లు వైజాగ్కు తీసుకురావడంలో నారా లోకేష్ పాత్ర కీలకం. ఆ టోర్నీ సందర్భంగానే ఈ విషయం స్పష్టమైంది. మహిళా క్రికెటర్లతో ఆయన ఇంటారక్షన్ జరపడం, వారికి ప్రోత్సహకాలు అందించడం వంటి విషయాలు తెలిసిందే. వైజాగ్ స్టేడియంలో మిథాలీ రాజ్, రవి కల్పన పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు చేయడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.
ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బీసీసీఐ అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నా.. నారా లోకేష్ చొరవతోనే వైజాగ్ క్రికెట్ హబ్గా మారిందని ఆ రాష్ట్ర ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్లు వైజాగ్ వేదికగా జరుగుతాయని, మంత్రి లోకేషా.. మజాకా అని కామెంట్ చేస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వైజాగ్ కంటే గొప్ప పేరున్న హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో గత రెండేళ్లుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఉప్పల్ స్టేడియంలో చివరిసారిగా 2024లో జనవరి 25-29 మధ్య భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అదే ఏడాది అక్టోబర్లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20కి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు మినహా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్కు హైదరాబాద్ వేదికగా నిలవలేదు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నెలకొన్న గొడవలు, గందరగోళ పరిస్థితులు , అవినీతి కేసులతో బీసీసీఐ ఈ స్టేడియంవైపు ముఖం కూడా చూడటం లేదు. ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ స్టేడియం క్లబ్, సీసీఎల్ మ్యాచ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.