న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 59 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీప్తి శర్మ(41, 1/35) ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్కు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మందాన జట్టును నడిపించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది. తెజల్ హసాబిన్స్(42), దీప్తి శర్మ(41), జెమీమా రోడ్రిగ్స్(35), యస్తికా భాటియా(37), షెఫాలీ వర్మ(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ స్మృతి మంధాన(5) తీవ్రంగా నిరాశపరిచింది.

న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కేర్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. జెస్ కేర్(3/49) మూడు వికెట్లు పడగొట్టింది. ఎడెన్ కార్సన్ రెండు వికెట్లు తీసింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 40.4 ఓవర్లలో 168 పరుగులకు కుప్పకూలింది. బ్రూక్ హాల్లిడే(39), మాడీ గ్రీన్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు తీయగా.. సజ్మా తాకోర్ రెండు వికెట్లు పడొట్టింది. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన దీప్తీ..
ఈ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(2) బద్దకంతో రనౌట్గా వెనుదిరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 విజేతలమనే గర్వమో లేక.. రనౌట్ చేయలేరనే అలసత్వమో తెలియదు కానీ.. విచిత్రకర రీతిలో సోఫీ డివైన్ పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ తెలివిగా వ్యవహరించి సోఫీ డివైన్ను ఔట్ చేసింది. దీప్తి శర్మ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ఆఖరి బంతిని ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా.. భారీ షాట్ ఆడేందుకు స్టెప్ ఔటైన సోఫీ డివైన్.. తన నిర్ణయాన్ని మార్చుకొని డిఫెన్స్ చేసింది. బంతి దీప్తి శర్మ చేతిలోకి వెళ్లగా.. ఆమె రనౌట్ చేస్తున్నట్లు హెచ్చరించింది. అయినా బెదరని సోఫీ డివైన్ అలానే నిల్చొంది.
వెంటనే వికెట్ కీపర్కు దీప్తి శర్మ బంతిని అందివ్వగా.. అంతే వేగంతో ఆమె వికెట్లను కొట్టేసింది. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రీప్లేలో సోఫీ డివైన్ ఇంచు తేడాతో క్రీజు బయట ఉన్నట్లు తేలింది. సోఫీ డివైన్ బ్యాట్ పెట్టి ఉంటే నాటౌట్గా మిగిలేది. కానీ బద్దకంతో వ్యవహరించి వికెట్ పారేసుకుంది.
టీ20 ఛాంపియన్..
ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ మహిళల జట్టు.. మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ పర్యటనకు వచ్చింది. గత ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించి కివీస్ తొలి టైటిల్ అందుకుంది.