అదరగొట్టిన ఓపెనర్లు..
తొలి రోజు ఆటలో ఇరు జట్ల ఆధిపత్యం కొనసాగింది. తమదైన ఆటతో నవ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో ఫస్ట్ డేను రెండు టీమ్స్ సమంగా పంచుకున్నాయి. కానీ బ్యాటింగ్కు పూర్తిగా ప్రతికూలమైన వాతావరణంలో టీమిండియా నిలకడగా రాణించడం చూస్తే కోహ్లీసేనదే పై చేయి అని చెప్పాలి. టాస్ గెలిచిన వెంటనే కివీస్ కెప్టెన్ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఫీల్డింగ్ తీసుకున్నాడు. కానీ భారత ఓపెనర్లు కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండి బంతి ముందుకు కదలకున్నా.. తమదైన షాట్లతో ఆకట్టుకున్నారు. నిదానంగా ఆడుతూ.. తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ఆడుతూ అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజాను ఆస్వాదించాడు. మరో ఎండ్లో శుభ్గిల్ సైతం ఫుల్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ప్రతి బంతి స్వింగ్ అవుతున్నా.. ఈ జోడీ ఏమాత్రం తడబడలేదు. బాడీకి దగ్గరగా వచ్చిన బంతులను మాత్రమే ఆడుతూ.. దూరంగే వెళ్లే బంతులను వదిలేసింది. 20 ఓవర్ల పాటు నిలకడగా ఆడి.. సెషన్ ముగిస్తుందనుకున్న తరుణంలో రోహిత్ బౌండరీ బాదే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వెంటాడి వికెట్ ఇచ్చుకున్నాడు. ఆ వెంటనే శుభ్మన్ సైతం వికెట్ సమర్పించుకున్నాడు. వీరిద్దరూ ఔటైనా భారత్కు జరగాల్సిన మేలు అయితే జరిగింది.
పుజార కొంపముంచిన అతిజాగ్రత్త..
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ వచ్చి రావడంతో తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాట్తో పరుగుల ఖాతా తెరిచాడు. మరోవైపు పుజారా మాత్రం పూర్తిగా డిఫెన్స్కు పరిమితమయ్యాడు. ఈ జోడీ పూర్తిగా క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. లంచ్ అనంతరం భారత్ పుజారా వికెట్ కోల్పోయింది. 54 బంతులు ఆడిన పుజారా రెండు బౌండరీలతోనే 8 పరుగులు చేశాడు. కానీ ఒక్క సింగిల్ తీయలేకపోయాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో పరుగులు రాక.. భారత్పై కివీస్ బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. అతిజాగ్రత్తతో ఆడిన పుజారా.. చివరకు ట్రెంట్ బౌల్ట్ సూపర్ స్వింగర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనూహ్యంగా తన కాళ్లవైపు దూసుకొచ్చిన బంతిని పుజారా అడ్డుకోలేకపోయాడు.
స్వింగ్కు అడ్డుగా నిలిచిన కింగ్..
కివిస్ బౌలర్లు స్వింగ్ బౌలింగ్తో చెలరేగగా కింగ్ కోహ్లీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పూర్తిగా డిఫెన్స్కు పరిమితమయ్యాడు. బంతిని మిడిల్ చేస్తూ కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డును ముందుకు నడింపిచాడు. 124 బంతులాడిన కోహ్లీ ఒకే ఒక ఫోర్ కొట్టి 44 రన్స్ చేశాడంటే అతను వికెట్ల మధ్య ఎలా పరుగెత్తాడో అర్థం చేసుకోవచ్చు. కెవిన్ పీటర్సన్ సైతం విరాట్ పరుగుకు ఫిదా అయ్యాడు. 'విరాట్ బ్యాటింగ్ను కాదు మనం చూడాల్సింది.. వికెట్ల మధ్య అతని పరుగును'అంటూ కామెంట్ చేశాడు. అతనికి అండగా నిలిచిన అజింక్యా సైతం తన అనుభవాన్ని రంగరించి బౌలర్లను ఎదుర్కొన్నాడు. దాంతో భారత్ మరో వికెట్ నష్టపోలేదు.
భారత్దే పై చేయి..
కివీస్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసినా భారత్ బ్యాట్స్మెన్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే 146 పరుగులు చేసిన భారత్ సులువుగా 250 పరుగులు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కింగ్ కోహ్లీ, అజింక్యా బిగ్ స్కోర్లు చేస్తే మాత్రం తిరుగుండదు. ఈ లెక్కన న్యూజిలాండ్పై భారత్ పై చేయిసాధించినట్లే. వాస్తవానికి పిచ్ ఉన్న కండిషన్స్లో భారత్ తొలి రోజు ఆటలో కనీసం ఏడు వికెట్లు కోల్పోవాల్సింది. న్యూజిలాండ్ బౌలర్లు వేసిన 60 ఓవర్లలో ప్రతీ బంతి స్వింగ్ అయింది.
కానీ భారత బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడారు. కోహ్లీసేన 300+ స్కోర్ చేస్తే మ్యాచ్పై పట్టు బిగించినట్లే. ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్లో 250 లక్ష్యం ఉన్నా కివీస్కు చేధించడం కష్టం అవుతుంది. మెగా ఫైనల్లో ఒత్తిడి డబుల్ ఉంటుంది. పైగా భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వారిని ఎదుర్కోవడం కివీస్కు బ్యాట్ మీద సామే.!