ఇండియా వర్సెస్ న్యూజిలాండ్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఘోర తప్పిదం చేశాడు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయిన జడేజా లడ్డూ లాంటి క్యాచ్ను నేలపాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గత మ్యాచ్లో సంచలన క్యాచ్తో టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ సొంతం చేసుకున్న జడేజా.. తాజా మ్యాచ్లో మాత్రం సునాయస క్యాచ్ను అందుకోలేకపోయాడు.
జడేజా చేసిన తప్పిదంతో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని రచిన్ రవీంద్ర పంచ్ షాట్ ఆడగా.. బ్యాక్వార్డ్ పాయింట్లో ఉన్న జడేజా చేతిలోకి నేరుగా వెళ్లింది.

కానీ ఈ క్యాచ్ను జడేజా అందుకోలేకపోయాడు. చాలా అరుదుగా మిస్ ఫీల్డ్ చేసే జడేజా.. మూడేళ్ల తర్వాత క్యాచ్ను వదిలేసాడు. చివరిసారిగా అతను 2020లో క్యాచ్ డ్రాప్ చేశాడు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అయిన జడేజా క్యాచ్ వదిలేయడం చూసి అందరూ అవాక్కయ్యారు. జడేజానేనా క్యాచ్ వదిలేసిందని సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు.
చివరకు అతని సతీమణి రివాబా జడేజా కూడా సునాయస క్యాచ్ను వదిలేయడం చూసి నమ్మలేకపోయింది. అయ్యో... అంటూ వినూత్నమైన రియాక్షన్ ఇచ్చింది. క్యాచ్ నేలపాలు చేయడం చూసి తల్లడిల్లింది. ప్రస్తుతం ఆమె రియాక్షన్కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. జడేజా క్యాచ్ నేలపాలు చేయడం చూసి ఎమ్మెల్యే తల్లడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గుజరాత్ ఎమ్మెల్యే అయిన రివాబా జడేజా జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన ఈ లైఫ్తో రచిన్ రవీంద్ర చెలరేగుతున్నాడు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగుతున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు సిరాజ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు.
ఓపెనర్ డెవాన్ కాన్వే(0)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే విల్యంగ్(17)ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.