ఇండియా వర్సెస్ న్యూజిలాండ్: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే చీలమండ గాయంతో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో ఆల్రౌండర్ ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో ఆదివారం జరగనున్న మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
అతని మోకాలి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2022 ముందు మోకాలి గాయంతో బాధపడిన జడేజా శస్త్ర చికిత్స చేసుకొని సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్తోనే అతను రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బంగ్లాదేశ్తో మ్యాచ్లో జడేజాకు ఈ మోకాలి గాయం తిరగబెట్టినట్లు.. నొప్పితో బాధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా జడేజా తన మోకాలికి ఐస్ ప్యాక్ పెట్టుకున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే జడేజా గాయం తీవ్రమైనది కాదని, భయపడాల్సిన పనిలేదని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
'ప్రస్తుతం జడేజా బాగానే ఉన్నాడు. సర్జరీ జరిగినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోకాలి గాయాలు తిరగబెట్టడం సహజం. అందుకే అతను ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడు. అతని నొప్పిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. టీమిండియా మెడికల్ టీమ్, ఫిజియోలు భారత ఆటగాళ్ల గాయాలపై ఓ కన్నేసి ఉంచారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
నొప్పితో బాధపడుతున్న జడేజాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా 4 విజయాలతో సౌకర్యవంతంగా ఉన్న టీమిండియాకు నాకౌట్ మ్యాచ్ల్లో ఇబ్బంది కలగవద్దంటే ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడం కీలకం. ఈ క్రమంలోనే ఆటగాళ్ల వర్క్లోడ్ను రొటేట్ చేసే అవకాశాలను టీమిండియా మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లతో మ్యాచ్ ఉన్నప్పుడు గాయాల చరిత్ర ఉన్న ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో మ్యాచ్కు జడేజాకు రెస్ట్ ఇవ్వడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మ్యాచ్ రోజు కూడా అతను అదే నొప్పితో బాధపడితే చివర్లో అతను ఆడటంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఒకవేళ అతను దూరమైతే రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగుతాడు. అయితే ఇప్పటికే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కాగా.. జడేజా కూడా దూరమైతే టీమిండియా బలహీన పడుతోంది. పైగా జడేజా దూరమైతే జట్టులో లెఫ్టాండర్ బ్యాటరే లేకుండా పోతాడు. సెమీఫైనల్ బెర్త్ ఖాయమైన తర్వాతనే ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.