దెబ్బతీసిన హార్దిక్ పాండ్యా..
386 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్(0)ను హార్దిక్ పాండ్యా సిల్వర్ డక్గా పెవిలియన్ చేర్చాడు. స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్తో ఓపెనర్ డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. అనంతరం వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 6వ ఓవర్లో నికోల్స్ 6,4 బాదగా.. హార్దిక్ వేసిన మరుసటి ఓవర్లో కాన్వే సిక్సర్ కొట్టాడు. తర్వాత నాలుగు ఓవర్లు అదే జోరులో ఈ జోడీ చెలరేగింది. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
డెవాన్ కాన్వే సెంచరీ..
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన నికోల్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్తో కలిసి కాన్వే చెలరేగాడు. వీలు చిక్కిన బంతిని తనదైన శైలిలో బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. చాహల్ వేసిన 24వ ఓవర్లో తొలి రెండు బంతులను సిక్స్లుగా మలిచి 70 బంతుల్లో మూడో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే డారిల్ మిచెల్(24)ను లార్డ్ శార్దూల్ విడదీయడంతో 78 పరుగుల మరో కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
ములుపు తిప్పిన శార్దూల్, ఉమ్రాన్ మాలిక్..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్(0)ను ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో గ్లేన్ ఫిలిప్స్(5)ను పెవిలియన్ చేర్చిన శార్దూల్ కోలుకోలేని దెబ్బతీసాడు. ఈ పరిస్థితుల్లో మైకేల్ బ్రేస్వెల్(26), డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఉమ్రాన్ మాలిక్ స్టన్నింగ్ డెలివరీతో సెంచరీ హీరో డెవాన్ కాన్వేను ఔట్ చేయడంతో మ్యాచ్ భారత్ వశమైంది. ఆ కొద్ది సేపటికే మైకేల్ బ్రేస్వెల్(26)ను కుల్దీప్ యాదవ్ స్టంపౌట్ చేయగా.. సాంట్నర్ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. లూకీ ఫెర్గూసన్(7)ను కుల్దీప్ ఔట్ చేయగా.. జకోబ్ డఫ్ఫీ(0)ని ఎల్బీ చేసిన చాహల్.. భారత విజయాన్ని లాంఛనం చేశాడు.