ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ను టీమిండియా ఓడించింది. అయినా కివీస్తో ఫైనల్ అంటే భారత అభిమానులకు భయం కలుగుతోంది.
అసాధారణ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్తో న్యూజిలాండ్ సూపర్ ఫామ్లో ఉంది. ముఖ్యంగా ఆ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్లు ఉండటం టీమిండియా అభిమానులను మరింత కలవరపెడుతోంది. అంతేకాకుంగా గతంలో ఆదివారం జరిగిన ఐసీసీ ఫైనల్స్లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. ఈ సారి ఆ సెంటిమెంట్ను టీమిండియా కొనసాగిస్తుందా? లేక తిరగరాస్తుందా? అనే టెన్షన్ అభిమానులను వెంటాడుతోంది.

ఇప్పటికే ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తూ ఈ మ్యాచ్పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. టీమిండియా విజయం సాధిస్తుందని మెజార్టీ పిపుల్ చెబుతున్నా.. ఎక్కడో ఓ ఆందోళన అయితే అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలోనే వన్ఇండియా తెలుగు ఛానెల్ సంప్రదాయ చిలక జోస్యాన్ని ఆశ్రయించింది.
అయితే చిలక జోస్యం కూడా టీమిండియానే విజేతగా నిలుస్తుందని తేల్చి చెప్పింది. చిలక ఓ కార్డ్ తీయగా.. ఆ కార్డ్ చూసి టీమిండియా విజేతగా నిలుస్తుందని చిలక జ్యోతిష్యుడు తెలిపారు. ఆదివారం పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో ఎవరు సెంచరీ చేస్తారని చిలకమ్మను అడగ్గా.. ఖాళీ కార్డును చూపించింది. దాంతో రోహిత్ శర్మకే సెంచరీ చేసే అవకాశాలున్నాయని, అతనికే మంచి పేరు వస్తుందని సదరు జ్యోతిష్యుడు తెలిపారు.
టాస్ విషయంలో చిలక జోతిష్యాన్ని పరిశీలించగా.. టీమిండియానే గెలుస్తుందని తేలింది. గత 14 మ్యాచ్లుగా టీమిండియా వరుసగా టాస్ ఓడిపోయింది. కానీ ఫైనల్లో టాస్ గెలుస్తుందని చిలక జోస్యం చెప్పింది. స్పిన్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడతాయని కూడా పేర్కొంది.