ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 43.3 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. మరోసారి విల్ యంగ్(51) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడ్డాయి. ఈ క్రమంలోనే నాలుగో ఇన్నింగ్స్లో 150 ప్లస్ టార్గెట్ ఛేధించడం టీమిండియాకు సవాలే.

శుభ్మన్, పంత్ జోరు..
అంతకుముందు 86/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్(5/103) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది. భారత్కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రిషభ్ పంత్, శుభ్మన్ నికలడగా ఆడటంతో టీమిండియా తొలి సెషన్లో ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్కు ముందు పంత్ ఔటయ్యాడు.
సుందర్ పోరాటం..
రెండో సెషన్లో టీమిండియా వెను వెంటనే వికెట్లు కోల్పోయింది. జడేజా, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ త్వరగా ఔటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ డకౌటవ్వడం టీమిండియా భారీ స్కోర్ అవకాశాలను అడ్డుకుంది. ఓవైపు వికెట్లు పడినా.. మరోవైపు సుందర్ దూకుడుగా ఆడాడు. అయితే మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. ఆకాశ్ దీప్ రనౌటై డైమండ్ డక్గా వెనుదిరిగాడు.
మలుపు తిప్పిన అశ్విన్..
28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డారిల్ మిచెల్, విల్ యంగ్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 50 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. జడేజా బౌలింగ్లో డారిల్ మిచెల్ భారీ షాట్ ఆడగా.. అశ్విన్ వెనక్కి పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ వికెట్ అనంతరం కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ, ఆజాజ్ పటేల్ కాసేపు ఇబ్బంది పెట్టినా.. జడేజా విడదీసాడు. హెన్రీని ఔట్ చేయగానే అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపేసారు. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే.