న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో వరుస పరాజయాలతో చతికిలపడిన టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమవుతోంది. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం(నవంబర్ 1)నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్లో న్యూజిలాండ్తో ఆతిథ్య టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అనూహ్యంగా తొలి రెండు టెస్ట్ల్లో పరాజయంపాలైన టీమిండియా ఇప్పటికే 0-2తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది.
కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే తొలి సిరీస్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్పై కన్నేసింది. దాంతో మూడో టెస్ట్ కూడా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

నో ర్యాంక్ టర్నర్..
పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ర్యాంక్ టర్నర్ వికెట్తో న్యూజిలాండ్ను బోల్తా కొట్టించాలని టీమిండియా రచించిన వ్యూహం బోల్తా కొట్టింది. తొలి రోజు నుంచే గింగిరాలు తిరిగిన స్పిన్ ట్రాక్పై భారత బ్యాటర్లు తేలిపోయారు. భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొని సాధారణ స్కోర్ నమోదు చేశారు.
అనంతరం టీమిండియా అదే స్పిన్కు విలవిలలాడి తక్కువ స్కోర్కే ఆలౌటైంది. దాంతో కివీస్కు 103 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ లీడ్ టీమిండియా ఓటమిని శాసించింది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్.. కెరీర్ బెస్ట్ గణంకాలు నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.
గంభీర్ యూటర్న్..
ఈ క్రమంలోనే స్పిన్ పిచ్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ యూటర్న్ తీసుకుంది. మూడో టెస్ట్ జరిగే వాంఖడే మైదానంలో బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వికెట్ను సిద్దం చేయాలని క్యూరేటర్కు సూచించినట్లు తెలుస్తోంది. రెండో రోజు నుంచి స్పిన్కు అనుకూలించేలా పిచ్ తయారు చేస్తున్నట్లు సమాచారం. స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పిన్తో పాటు బెంగళూరు టెస్ట్లో భారత బ్యాటర్లు పేస్ బౌలింగ్కు కూడా ఇబ్బంది పడ్డారు. కివీస్ స్వింగ్ బౌలింగ్కు 46 పరుగులకే కుప్పకూలారు. ఈ రెండు టెస్ట్ల పరాజయాల నేపథ్యంలో ముంబై పిచ్ తయారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్యాట్, బంతికి సమతూకమైన పోటీ ఉండేలా పిచ్ను తయారు చేస్తున్నట్లు ఓ జాతీయ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది.
'ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ కోసం సమతూకమైన పిచ్ను సిద్దం చేస్తున్నాం. ప్రస్తుతం వికెట్పై కాస్త గడ్డిని వదిలేసాం. తొలి రోజు ఆటలో వికెట్ బ్యాటింగ్కు రెండో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుంది'అని వాంఖడే గ్రౌండ్ అధికారి తెలిపారు.