న్యూజిలాండ్తో మూడో టెస్ట్లోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేలవ బ్యాటింగ్తో సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్లోనే అదే తడబాటు కొనసాగిస్తోంది. 8 బంతులు.. 6 పరుగుల వ్యవధిలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30), నైట్ వాచ్ మ్యాన్ మహమ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లీ(4) దారుణంగా విఫలమయ్యారు.

క్రీజులో శుభ్మన్ గిల్(38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్( 1 బ్యాటింగ్) ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు.
న్యూజిలాండ్ 235 ఆలౌట్..
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్దీప్ ఓ వికెట్ తీసాడు. బౌలింగ్లో సత్తా చాటమనే ఆనందాన్ని భారత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నీరు గార్చారు.
చెలరేగిన సుందరం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్తో మరో ఓపెనర్ టామ్ లాథమ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(5)ను కూడా సుందర్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు.
దాంతో 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్ పూర్తిగా డిఫెన్స్కు పరిమితమయ్యారు. దాంతో కివీస్ 92/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రఫ్ఫాడించిన జడేజా..
రెండో సెషన్లో ఈ జోడీ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఓపికగా ఆడుతూ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో విల్ యంగ్ 94 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో డారిల్ మిచెల్ సైతం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసాడు.
విల్ యంగ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో టామ్ బ్లండెల్(0)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే గ్లేన్ ఫిలిప్స్(7)ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు డారిల్ మిచెల్ 90 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 192/6 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
జడేజా ఫిఫ్పర్..
మూడో సెషన్ ఆరంభంలోనే ఇష్ సోదీ(7)ని జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. సెంచరీ దిశగా సాగిన డారిల్ మిచెల్ను సుందర్ పెవిలియన్ చేర్చాడు. మ్యాట్ హెన్రీ(7)ని క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. ఆజాజ్ పటేల్(1)ను సుందర్ ఔట్ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
అనంతరం భారత ఇన్నింగ్స్ను రోహిత్, యశస్వి జైస్వాల్ మెరుగ్గానే ప్రారంభించారు. బౌండరీలతో జోరు కనబర్చిన రోహిత్ క్రీజులో సెట్ అయినట్లు కనిపించాడు. బౌండరీ లైన్ వద్ద ఓరూర్కీ క్యాచ్ వదిలేయడంతో రోహిత్కు ఓ లైఫ్ కూడా లభించింది. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు.
కొంపముంచిన సిరాజ్..
క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్తో యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడాడు. రెండో వికెట్కు 51 పరుగుల జోడించిన అనంతరం యశస్వి జైస్వాల్ అనవసర రివర్స్ స్వీప్కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో 4 ఓవర్లలో డే1 ఆట ముగుస్తుందనగా యశస్వి చేసిన ఈ తప్పిదం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. నైట్వాచ్మన్గా మహమ్మద్ సిరాజ్ను పంపించగా.. అతను గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.
దాంతో కోహ్లీ క్రీజులోకి రాక తప్పలేదు. బౌండరీతో జోరు కనబర్చిన కోహ్లీ.. అనవసర పరుగుకు ప్రయత్నించి మ్యాట్ హెన్రీ డైరెక్ట్ హిట్కు రనౌటయ్యాడు. దాంతో భారత్ 6 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.