ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.
దూకుడుగా ఆడిన వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో అతనికి సహకారం లభించకపోవడంతో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్(5/103) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది. భారత్కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

శుభ్మన్ పంత్ జోరు..
86/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఓవర్నైట్ బ్యాటర్లు రిషభ్ పంత్, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీ ముంగిట శుభ్మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్ను చాప్మన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన గిల్.. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మరో ఎండ్లో రిషభ్ పంత్ తన ట్రేడ్ మార్క్ సిక్స్లతో చెలరేగాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఇచ్చిన సునాయస క్యాచ్ను మ్యాట్ హెన్రీ నేలపాలు చేశాడు. ఆ కాసేపటికే పంత్ను ఇష్ సోధీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. క్రీజులోకి జడేజా రాగా.. టీమిండియా 195/5 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
సుందర్ ఒంటరి పోరాటం..
రెండో సెషన్ ఆరంభంలోనే జడేజా(14)ను గ్లేన్ ఫిలిప్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్.. ఆజాజ్ పటేల్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కానీ సెంచరీకి చేరువైన అతన్ని ఆజాజ్ పటేల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం అశ్విన్ బ్యాటింగ్కు రాగా.. సుందర్ ఆచితూచి ఆడుతూ.. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ను ధాటించాడు.
అయితే షార్ప్ టర్న్తో అశ్విన్ను ఆజాజ్ పటేల్ క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. క్రీజులోకి ఆఖరి వికెట్గా ఆకాశ్ దీప్ రాగా.. వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. భారీ సిక్సర్లు బాదాడు. కానీ స్ట్రైకింగ్ ఉంచుకోవాలనే ఆతృతలో సెకండ్ రన్ కు కాల్ ఇవ్వగా.. ఆకాశ్ దీప్ రనౌటయ్యాడు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్కు తెరపడింది.
న్యూజిలాండ్ 235
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్దీప్ ఓ వికెట్ తీసాడు.