న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా విజేతగా నిలిచింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఊచకోతతో 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది.
భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48), మార్క్చాప్మన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32), మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/17) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా(1/35) ఒక వికెట్ తీసాడు.

అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్), సూర్యకువార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు.
154 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సంజూ శాంసన్(0) మరోసారి నిరాశపర్చాడు. ఇషాన్ కిషన్(28)తో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. ఈ ఇద్దరూ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడటంతో 19 బంతుల్లోనే భారత్ 50 పరుగులు చేసింది. దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఇషాన్ ఔటైనా.. సూర్యతో కలిసి అభిషేక్ శర్మ చెలరేగాడు. 14 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్స్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు సూర్య కూడా బ్యాట్ ఝులిపించడంతో పవర్ ప్లేలోనే భారత్ 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. వేగంగా పరుగులు రాబట్టి. తన 360 ఆటతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్.. 25 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరో బౌండరీ బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అభిషేక్ శర్మకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనుంది.