వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ను 2-0తో గెలుచుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ(108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124) భారీ శతకంతో రాణించినా భారత్కు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137), గ్లేన్ ఫిలిప్స్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106) శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/63), హర్షిత్ రాణా(3/84) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/43), కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ శతకానికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి(57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 53), హర్షిత్ రాణా(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాక్ ఫోక్స్(3/77), క్రిస్టియన్ క్లార్క్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. జైడెన్ లెన్నాక్స్(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. కైల్ జెమీసన్ ఒక వికెట్ తీసాడు.

338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్మన్ గిల్(23) తీవ్రంగా నిరాశపర్చారు. ఫోక్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఔటవ్వగా.. శుభ్మన్ గిల్ను జెమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడటంతో తొలి పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులే చేసింది.
ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) వరుస ఓవర్లలో వెనుదిరిగాడు. క్లార్క్ బౌలింగ్ అయ్యర్ క్యాచ్ ఔటవ్వగా.. రాహుల్ను లెనాక్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు.
ఈ క్రమంలో కోహ్లీ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న నితీష్ రెడ్డి .. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించాడు. గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే క్రిస్టియన్ క్లార్క్ వేసిన ఆ మరుసటి ఓవర్లో నితీష్ రెడ్డి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది.
నితీష్ ఔటైనా.. హర్షిత్ రాణా దూకుడుగా ఆడి విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీ సైతం తన దూకుడుగా ఆడి 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీని కోహ్లీ సెలెబ్రేట్ చేసుకోలేదు. హర్షిత్ రాణా భారీ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఫోక్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన హర్షిత్ రాణా.. కెరీర్లోనే తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అదే ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగడంతో ఏడో వికెట్కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.