రాయ్పూర్: న్యూజిలాండ్తో రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/18) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51), శుభ్మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, సాంట్నర్ తలో వికెట్ తీసారు. అయితే ఈ భారీ విజయంతో టీమిండియా చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలోనే అత్యధిక బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్పై విజయాన్నందుకున్న జట్టుగా నిలిచింది.
1. ఈ మ్యాచ్లో భారత్ 179 బంతులు మిగిలి ఉండగానే కివీస్పై గెలుపొందింది. ఈ క్రమంలో 2010లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో 173 బంతుల తేడాతో గెలిచిన రికార్డును అధిగమించింది. ఓవరాల్గా బంతుల ప్రకారం భారత్కు ఇది మూడో అతిపెద్ద విజయం.
2. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. బ్యాటర్గా భారత్ సాధించిన వన్డే విజయాల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీని అధిగమించాడు. రోహిత్ ఇప్పటి వరకు 240 మ్యాచ్ల్లో 9681 పరుగులు చేయగా.. భారత్ విజయాలు సాధించిన మ్యాచ్ల్లో 6822 పరుగులున్నాయి. గంగూలీ భారత్ సాధించిన విజయాల్లో 6818 రన్స్ చేశాడు.
3. ఇక సొంతగ్గడపై భారత్కు వరుసగా ఏడో వన్డే ద్వైపాక్షిక సిరీస్ విజయం. 2019లో 3-2తో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. తాజా సిరీస్ వరకు వరుసగా సొంతగడ్డపై వన్డే సిరీస్లు గెలిచింది.