
ఓపెనర్ల జోరు..
అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), డారిల్ మిచెల్(28 బంతుల్లో 3 ఫోర్లతో 31) మంచి శుభారంభాన్ని అందించారు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ తొలి బంతినే బౌండరీకి తరలించి ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించిన గప్టిల్.. ఆ తర్వాత మరో రెండు బౌండరీలు బాదాడు. అయితే ఈ ఓవర్లో 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో గప్టిల్ మరింత చెలరేగాడు. భువీ వేసిన మూడో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. మరో ఎండ్లో డారిల్ మిచెల్ సైతం బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది.

రోహిత్ మార్క్ కెప్టెన్సీ..
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీతో విడదీశాడు. దీపక్ చాహర్ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతని ఓవర్లో ఫస్ట్ బాల్ను సిక్స్ బాదిన గప్టిల్ మరుసటి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్(21) వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో కూడా మరో బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.

చెలరేగిన హర్షల్..
ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ప్రయత్నం చేసినా.. పరుగులు వచ్చాయి. అయితే కివీస్ సైతం వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. డేంజరస్ చాప్మన్ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు గ్లేన్ ఫిలిప్స్ ధాటిగా ఆడుతూ పరుగుల వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. క్రీజులోకి వచ్చిన టీమ్ సీఫెర్ట్తో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే సీఫెర్ట్ను అశ్విన్ పెవిలియన్కు చేర్చగా.. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఫిలిప్స్కు హర్షల్ పటేల్ కళ్లెం వేసాడు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు వేగం తగ్గింది. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లో న్యూజిలాండ్ 15 పరుగులు మాత్రమే చేసింది.


Click it and Unblock the Notifications












