IND vs NZ 1st Test: ముగిసిన తొలి రోజు ఆట.. చెలరేగిన అయ్యర్, జడేజా! భారత్దే ఆధిపత్యం!

కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. సెకండ్ సెషన్లో తడబడినా.. అరంగేట్ర ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 75 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(100 బంతుల్లో 6 ఫోర్లతో 50 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(13), చతేశ్వర్ పుజారా(26), అజింక్యా రహానే(35) విఫలమైనా.. ఓపెనర్ శుభ్మన్ గిల్(93 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక బ్యాడ్ లైట్ కారణంగా మరో 6 ఓవర్ల ఆట మిగిలుండగానే అంపైర్లు ఆటను నిలపేసారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు వికెట్లతో చెలరేగగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు.

మయాంక్ మళ్లీ విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కైల్ జెమీసన్ బౌలింగ్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో 21 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. మరో ఎండ్లో పుజారా యాంకర్ రోల్ పోషించడంతో గిల్.. తన మార్క్ బ్యాటింగ్తో పరుగులు రాబట్టాడు.
అజాజ్ పటేల్ వేసిన 17వ ఓవర్లో శుభ్మన్ గిల్ కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. గిల్ ధాటికి బంతి మైదానం బయట పడగా.. మరో బంతితో మ్యాచ్ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సోమర్ విల్లే వేసిన 26వ ఓవర్ మూడో బంతికి క్విక్ సింగిల్ తీసిన గిల్.. టెస్ట్ల్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 82/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

దెబ్బ మీద దెబ్బ..
ఫస్ట్ సెషన్లో ఒకే వికెట్తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్.. రెండో సెషన్లో దుమ్మురేపింది. భారత్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో సెషన్ ప్రారంభంలోనే హాఫ్ సెంచరీతో దూకుడు మీదున్న శుభ్మన్ గిల్కు కళ్లెం వేసింది. కైల్ జెమీసన్ వేసిన సెకండ్ సెషన్ ఫస్ట్ ఓవర్లోనే గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే టీమ్ సౌథీ బౌలింగ్లో చతేశ్వర్ పుజారా(26) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి అయ్యర్ రాగా.. రహానే బౌండరీలతో జోరు కనబర్చాడు. క్రీజులో కుదురుకుంటున్న అతన్ని జెమీసన్ బోల్తా కొట్టించాడు. రహానే బలహీనతపై దెబ్బకొడుతూ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 145 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి జడేజా రాగా.. ఆచితూచి ఆడిన అయ్యర్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో భారత్ 154/4తో టీ బ్రేక్కు వెళ్లింది.

అయ్యర్, జడేజా జోరు..
ఇక టీ బ్రేక్ అనంతరం శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా దుమ్మురేపారు. స్మార్ట్ బ్యాటింగ్తో పరుగులు చేశారు. మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే టీమ్ సౌథీ వేసిన 68వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన అయ్యర్..94 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
దాంతో అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. అనంతరం వేగం పెంచిన అయ్యర్.. అజాజ్ పటేల్ వేసిన 75వ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాదాడు. ఇక జెమీసన్ వేసిన 84వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జడేజా.. సౌథీ వేసిన ఆ మరుసటి ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం బ్యాట్ను కత్తిసాములా తిప్పుతూ.. తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. సోమర్ విల్లే వేసిన ఆ మరుసటి ఓవర్లో అయ్యర్ భారీ సిక్సర్ బాదగా.. ఈ ఓవర్ అనంతరం బ్యాడ్ లైట్తో తొలి ఆట ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications