
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు సొంతగడ్డపై మరో ఆసక్తికరపోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్..
కొత్త కోచ్తో సరికొత్తగా కనిపిస్తున్న జట్టు.. 2022 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగే ఫస్ట్ టీ20లో వరల్డ్ కప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ సిరీస్తోనే కోచ్గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్గా రోహిత్ శర్మ శకం మొదలవుతుండటంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి పోరులోనే గెలిచి సిరీస్ పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తొంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ ఫలితం భారత్కు కీలకం.
ఇక ఈ మూడు టీ20ల సిరీస్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్లోనే ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 ప్రపంచకప్లో భారత నిష్క్రమణతో భారీ నష్టాలను చవిచూసిన స్టార్ స్పోర్ట్స్.. ఇక నుంచి జరిగే ద్వైపాక్షిక సిరీస్లతో ఆ లోటును తీర్చుకోవాలనుకుంటుంది. స్టార్ స్పోర్ట్స్ సంబంధిత చానెల్స్ స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చానెల్స్లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మనకు నచ్చిన భాషలో మెచ్చిన ఆటను ఆస్వాదించే సౌకర్యాన్ని స్టార్ స్పోర్ట్స్ కలిపిస్తోంది. అయితే ఈ చానెళ్లను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మ్యాచ్లను వీక్షించవచ్చు. దానికి కొంత డబ్బులు చెల్లించాలి. హాట్ స్టార్లో సైతం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
ఇక ఫ్రీగా చూసే అవకాశం కూడా ప్రేక్షకులకు ఉంది. డీడీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్లను పుక్కట్ల చూడవచ్చు. డబ్బులు చెల్లించలేని వారు ఎవరైనా ఉంటే డీడీ స్పోర్ట్స్ చానెల్ సేవలను వాడుకోవచ్చు. అయితే అధికారిక బ్రాడ్ కాస్టర్.. డీడీ స్పోర్ట్స్లో వచ్చే మ్యాచ్కు కొన్ని సెకన్ల వ్యత్యాసం ఉంటుంది.
టీమ్ విషయానికొస్తే... ఏడాదిలోపే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లు ఏ మేర ఉపయోగపడతారో అంచనా వేయనున్నారు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్. ఇప్పుడు జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కొందరికి మిడిల్ ఆర్డర్ స్థానాలు కేటాయించడం సవాలే. రోహిత్, రాహుల్ తొలి టీ20లో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువ. వెంకటేశ్ అయ్యర్ కూడా ఓపెనర్గానే ఐపీఎల్లో సత్తా చాటాడు. ఇప్పుడు అతడు మిడిల్ ఆర్డర్లో రానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వస్తాడు. ప్రపంచకప్లో ఆకట్టుకోలేకపోయిన అతను.. ఈసారి చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, పంత్లతో భారత లైనప్ పేపర్పై బలంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా గైర్హాజరీలో అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ పాత్రను పోషించనున్నాడు. యూఏఈలో రాణించిన అశ్విన్ తుది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. దీపక్ చాహర్, చాహల్ కూడా బరిలోకి దిగడం ఖాయం.