IND vs NZ 1st semi-final: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టిన విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
వన్డే క్రికెట్లో శతకాల హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ను అధిగమించాడు. సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో 49వ శతకం బాది సచిన్ రికార్డ్ను సమం చేసిన కోహ్లీ.. తాజా సెమీస్లో మరో సెంచరీ నమోదు చేసి క్రికెట్ గాడ్ ముందే 50 సెంచరీలతో వరల్డ్ రికార్డ్ అందుకున్నాడు.

ఓవరాల్గా విరాట్ కోహ్లీకి ఇది 80వ సెంచరీ. విరాట్ కోహ్లీ ముందు సచిన్ 100 శతకాల రికార్డ్ మాత్రమే ఉంది. ఇక 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా కోహ్లీ చరిత్రకెక్కాడు.
సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ అధిగమించాడు. 2003 వన్డే ప్రపంచకప్లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్గా ఉండగా.. తాజా మ్యాచ్లో కోహ్లీ(673*) అధిగమించాడు.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. శుభ్మన్ గిల్తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఉక్కపోత వాతావరణంలో క్రాంప్స్తో గిల్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడినా.. శ్రేయస్ అయ్యర్తో కలిసి 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. 106 బంతుల్లో శతకం సాధించాడు.
సెంచరీ ముంగిట క్రాంప్స్తో బాధపడ్డ కోహ్లీ.. ఫెర్గూసన్ బౌలింగ్లో బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ రికార్డ్ సెంచరీ సాధించడంతో అతని సతీమణి అనుష్క శర్మ ముద్దులతో ముంచెత్తింది. చిన్న పిల్లలా ఎగిరి గంతేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105) శతకాలతో రాణించారు.