IND vs NZ 1st semi-final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా పదో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్తో బుధవారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఏడు వికెట్లతో చెలరేగిన(7/57) మహమ్మద్ షమీ న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105) శతకాలతో రాణించారు. శుభ్మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 134) సెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..
398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(13), రచిన్ రవీంద్రలను మహమ్మద్ షమీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దాంతో న్యూజిలాండ్ 39 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆచితూచి ఆడారు.
క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 49 బంతుల్లో డారిల్ మిచెల్, 58 బంతుల్లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రతీ ఓవర్లో బౌండరీ రాబట్టాడు.
డారిల్ మిచెల్ సెంచరీ..
85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్ మిచెల్.. భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ జోడీ సూపర్ బ్యాటింగ్తో మూమెంటమ్ మొత్తం న్యూజిలాండ్ వైపు మళ్లింది. రోహిత్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. బుమ్రా బౌలింగ్లో కేన్ విలియమ్సన్ ఇచ్చిన సునాయ క్యాచ్ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను రెచ్చిపోయాడు.
మలుపు తిప్పిన మహమ్మద్ షమీ..
181 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మహమ్మద్ షమీ విడదీసాడు. కేన్ విలియమ్సన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్ను కూడా బంతి వ్యవధిలో డకౌట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన గ్లేన్ ఫిలిప్స్తో డారిల్ మిచెల్ నిలకడగా ఆడాడు. కీలక భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బుమ్రా విడదీసాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన ఫిలిప్స్(41)ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మార్క్ఛాప్మన్(2)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. సెంచరీ హీరో డారిల్ మిచెల్ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్తో షమీ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో ఫైవ్ వికెట్ హాల్.
అనంతరం సిరాజ్ ఓ వికెట్ తీయగా.. బుమ్రా మరో రెండు వికెట్ల తీయడంతో న్యూజిలాండ్ కుప్పకూలింది.