IND vs NZ 1st semi-final: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఏడు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ తీయడం ద్వారా మహమ్మద్ షమీ ఈ ఫీట్ సాధించాడు. 17 ఇన్నింగ్స్ల్లో 50 వికెట్ల మైలు రాయి అందుకొని మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డ్ను అధిగమించాడు. మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో షమీ, స్టార్క్ తర్వాత లసిత్ మలింగా(25 ఇన్నింగ్స్ల్లో), ట్రెంట్ బౌల్ట్(28) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

షమీ సాధించిన 50 వికెట్లలో 23 వికెట్లు ఈ టోర్నీలో వచ్చినవే. తాజా ప్రపంచకప్లో 6 మ్యాచ్లే ఆడిన షమీ.. ఇప్పటికే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్గా కూడా షమీ చరిత్రకెక్కాడు.
వన్డే ప్రపంచకప్ల్లో షమీ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. మిచెల్ స్టార్క్ మూడు సార్లు అందుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్గా(7/57) షమీ చరిత్రకెక్కాడు.
హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవడంతో తుది జట్టులోకి వచ్చి షమీ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్లు మలుపు తిప్పుతున్నాడు. తాజా మ్యాచ్లోనూ 181 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన డారిల్ మిచెల్-కేన్ విలియమ్సన్ జోడీని విడదీసాడు. కేన్ విలియమ్సన్ టెంప్టింగ్ బాల్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన షమీ.. అనంతరం క్రీజులోకి గ్లేన్ ఫిలిప్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి డకౌట్ చేశాడు.
దాంతో మూమెంటమ్ మళ్లీ భారత్ వైపు మళ్లింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 105) శతకాలతో రాణించారు.
శుభ్మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 134) సెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.