అనుభవలేమి ఆటగాళ్లతోనే న్యూజిలాండ్ అదరగొట్టింది. అద్వితీయమైన బ్యాటింగ్తో అదిరిపోయే లక్ష్యాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 301 పరుగుల కొండంత లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.
డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హర్షిత్ రాణా బౌలింగ్లో నికోల్స్ ఇచ్చిన సునాయస క్యాచ్ను కుల్దీప్ యాదవ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన ఈ జోడీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఆ తర్వాత కాస్త దూకుడు పెంచిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో నికోల్స్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డెవాన్ కాన్వే కూడా 60 బంతుల్లోనే అర్థ శతకం అందుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు హర్షిత్ రాణా విడదీసాడు.
వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్ సాయంతో హెన్రీ నికోల్స్ను పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే డెవాన్ కాన్వేను కూడా హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12)ను మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. గ్లేన్ ఫిలిప్స్(12)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. మిచెల్ హే(18)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ మైఖేల్ బ్రెస్వెల్(18) సాయంతో డారిల్ మిచెల్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రేస్వెల్ను అయ్యర్ అద్భుతమైన త్రోతో రనౌట్గా పెవిలియన్ చేర్చగా.. జాక్ ఫోల్క్స్(1)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రిస్టియన్ క్లార్క్ సాయంతో డారిల్ మిచెల్ చెలరేగాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని ప్రసిధ్ కృష్ణ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. కైల్ జెమీస్ సాయంతో క్రిస్టియన్ క్లార్క్(24) జట్టు స్కోర్ను 300 పరుగులకు చేర్చాడు.